Thursday, May 19, 2011

ఆదర్శ రైతు గ్రామం - ఏనెబావి (Enabavi)

Courtesy: EENADU Weekend

దేశమంతా వ్యాపించిన చికున్‌ గున్యా వీరి దరిదాపుల్లోకి రాలేదు. కళ్లకలక వంటి అంటువ్యాధుల వాసన కూడా సోకలేదు. అకాల మరణాల బెడదే లేదు. మూడేళ్ల క్రితం ఓ పండు ముదుసలి మరణించారు. మళ్లీ, ఈ మార్చి 19న మరో పండుముదుసలి కాలం చేశారు. 'ప్రకృతిని కాపాడుకుంటున్నాం.. ప్రకృతి మమ్మల్ని కాపాడుతోంది' అంటారా గ్రామస్థులు. ఎవరికీ కేన్సర్‌, గుండె జబ్బు, మధుమేహం వంటి వ్యాధులు రాలేదని సగర్వంగా చెబుతారు. రసాయన ఎరువులు అతిగా వాడటం వల్ల వచ్చే కొన్నిరకాల చర్మవ్యాధులు, శ్వాసకోశవ్యాధులు... వూరి పొలిమేరల్లో కాలుపెట్టడానికి కూడా సాహసించడం లేదు.



రైతంటే ఆత్మహత్యలే ఎందుకు గుర్తుకు రావాలి? సేద్యంలో అప్పులే ఎందుకు మిగలాలి? పొలిమేరలో కాలుపెట్టగానే క్రిమిసంహారకాల వాసనే ఎందుకు గుప్పుమనాలి? 'రసాయన రహిత గ్రామం'గా రికార్డుకెక్కిన వరంగల్‌జిల్లాలోని ఏనెబావి... పల్లెలకు పాఠం, రైతులకు ఆదర్శం, సమష్టి కృషికి నిదర్శనం.

గ్రామీణ స్వావలంబన గురించి ఏ సదస్సులో చర్చకు వచ్చినా ఆ వూరిపేరే చెబుతారు. క్రిమిసంహారకాల్లేని సేద్యం గురించి ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా ఆ వూరినే ఉదాహరణగా చూపుతారు. నీటి పొదుపు గురించి ఎవరు అధ్యయనం చేయాలన్నా ఆ వూరికే వస్తారు. విత్తనాల కొరతను అధిగమించడం ఎలాగో ఆ వూరి రైతులనే అడుగుతారు. 'అప్పుల్లేని రైతులు ఎక్కడైనా ఉన్నారా' అన్న ప్రశ్నకూ ఆ వూరే సమాధానం.
...ఏనెబావి!
ఆ గ్రామస్థుల ఆలోచనలు, నిర్ణయాలు, శ్రమజీవనం, పర్యావరణ ప్రియత్వం... అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తున్నాయి. దాదాపు 30 వేలమంది రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు... ఆ పల్లెను పర్యాటక కేంద్రమంత ఆసక్తితో తిలకించారు. ఆధ్యాత్మిక క్షేత్రమంత భక్తితో దర్శించుకున్నారు. ఆ ఘనత వెనుక చాలా శ్రమ ఉంది. సంఘర్షణ ఉంది. వైఫల్యాలున్నాయి. చేదు అనుభవాలున్నాయి. ఆ రైతులు అన్నింటినీ భరించారు, ఎదిరించారు, గెలిచారు, చరిత్రకెక్కారు.
అనగనగా...
ఏనెబావి శివారు పల్లె. వరంగల్‌ జిల్లా జనగామ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని లింగాలఘనపురం మండలంలో ఉంది. మాణిక్యపురం గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది. 280 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఆ పల్లెలో 51 కుటుంబాలు ఉన్నాయి.
జనాభా... పిల్లాపెద్దా కలిసి 207 మంది. నిజమే, చాలా చిన్న పల్లెటూరే. కానీ, ఆ పల్లె వెనుక పెద్ద కథే ఉంది.
జనగామ డివిజన్లోని గ్రామాలన్నీ ఇంకా తెలంగాణ సాయుధ పోరాట ప్రభావంలో ఉన్న సమయమది. పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం సాగిస్తున్నారు. నర్మెట్టలో భూస్వామ్య వ్యవస్థ ఛాయలు పూర్తిగా సమసిపోలేదు. ఉన్నపొలమంతా నలుగురైదుగురు సంపన్నులదే. పల్లెపల్లెంతా పాలేర్లే! కొన్ని కుటుంబాలవారు ఆ బానిస బతుకులు బతకలేక..సంకెళ్లు తెంచుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. దగ్గర్లోని ఓ గ్రామంలో ముస్లిం భూస్వామికి పదిహేనువందల ఎకరాల బంజరుభూమి ఉందని ఎవరో చెప్పారు. ఆ నేలను సాగుచేసుకోవాలన్న ఆశ కలిగింది. ఆ పంజరంలోంచి బయటపడాలన్న ఆకాంక్ష పెరిగింది. తమ ఆలోచన తెలిస్తే పెత్తందార్లు కళ్లెర్రజేస్తారేవో అన్న భయవెుకవైపు. ఇట్టెబోయిన యాదయ్యకు ఆ సంగతులింకా గుర్తున్నాయి... ''మాది నర్మెట్ట. లింగాలఘనపురం నుంచి ఓ శాలాయన బట్టలు తెచ్చి అమ్మేవాడు. ఓ వూళ్లో వందల ఎకరాల బంజరు భూమి ఉందని అతనే మా పట్వారీకి చెప్పాడు. పట్వారీ మాకు చెప్పాడు. 1962లో మాకున్న గుడిసేగుట్టా అమ్ముకుని వెుత్తం అయిదు కుటుంబాల వాళ్లం బయల్దేరాం. ఆతర్వాత ఇంకో ఎనిమిది కుటుంబాలు వచ్చాయి. ముందుగా, నల్గొండ జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరికి చేరుకున్నాం. ఆ ఊరి సంపన్నుడిదే భూమి. ఆస్తులన్నీ అమ్మగా వచ్చిన డబ్బంతా పోగేస్తే పాతికవేలైంది. 133 ఎకరాలు కొన్నాం. కొనడమైతే కొన్నాం కానీ... అంతా బీడుభూమి. ఎటుచూసినా రాళ్లూరప్పలే. ఎదురుగా ఏనె (చిన్న గుట్టలాంటిది), పక్కనే బావి. ఏనెబావి అని పిలుచుకున్నాం!
ఆ భూమిని సాగులోకి తీసుకురావడానికి రెక్కలు ముక్కలు చేసుకున్నాం. అదే బతుకన్నంత కష్టపడ్డాం. నిద్రలేచింది వెుదలు... చికటి పడేవరకూ... అదే పని, అదే ధ్యాస! ఆకలి తెలియదు, దప్పిక తెలియదు. మాకు కష్టం కొత్తకాదు. కానీ ఎప్పుడూ మాకోసం మేం కష్టపడింది లేదు. మా చెమటంతా పెత్తందార్ల కోసమే ధారపోశాం. ఇప్పుడు... మా కోసం మేం శ్రమిస్తున్నాం. ఆ మట్టి మాది. ఆ నీరు మాది. ఆ గడ్డిపరక మాది. అందుకేనేవో, మాకు అలసట తెలియలేదు. భూమి ఒక చోట..కాపురం మరోచోట అయితే సేద్యం సాగదని తొందర్లోనే అర్థమైంది. అందుకే ఏనెబావి దగ్గరే తాటి కమ్మలతో గుడిసెలు వేసుకున్నాం''.
అలా పల్లె పుట్టింది. పొలం సిద్ధమైంది.
రంకెలేస్తూ బసవన్న వచ్చాడు. ఉత్సాహంగా కాడె భుజానికెత్తుకున్నాడు. లక్షణంగా గోవుమాలచ్చిమి వచ్చింది. ఇంటింటా పాలు పొంగించింది. కామధేనువు కాలుపెట్టింది. మరి, కల్పవృక్షం! చెరువే కల్పవృక్షమైంది. చేనుకు చేవ రావాలంటే, భూమిలో జీవం ఉండాలి. అదేవో బీడు భూమి. అంత సారవంతమైన మట్టి ఎక్కడ దొరుకుతుంది? ఆ చెరువులోని మట్టికి పరుసవేది విద్య తెలుసు. ఆ స్పర్శతో పంట బంగారమవుతుంది. తలోచేయీ వేసి మట్టిని తరలించారు. 'చెరువు మా కన్నతల్లి..కంటి పాప. బుక్కెడు బువ్వ నోట్లోకి పోతోందంటే... మా గరిసెల్లో ధాన్యం కుప్పలున్నాయంటే... ఆ చెరువు మట్టే కారణం' అంటారు ఏనెబావి ప్రజలు.


గుణపాఠం...
ఓ రైతు. అతని దగ్గర రోజుకో బంగారు గుడ్డు పెట్టే బాతు. కొంతకాలం సంతోషంగానే ఉన్నాడు. మెల్లగా దురాశ వెుదలైంది. దురాలోచన వేధించింది. కడుపుకోస్తే బోలెడన్ని బంగారు గుడ్లు దొరుకుతాయని ఆశపడ్డాడు. మిగిలిందేమిటి? నిరాశే! చిన్నప్పుడు చదువుకున్న కథే. పెద్దయ్యాక, ఆ కథలోని నీతి తెలియాల్సిన సమయానికి మన ఆలోచనారీతి దారితప్పిపోతుంది. ఏనెబావి విషయంలోనూ అదే జరిగింది. కొంతకాలానికి సంప్రదాయ సేద్యం వెుహంవెుత్తిపోయింది. రసాయన ఎరువులు చూసిన కళ్లకి... చెరువు మట్టి ఆనలేదు. క్రిమిసంహారకాల ఘాటు ముందు... పెంటకుప్పలు చిన్నబోయాయి. మరింత పంట పండాలి? మరింత దిగుబడి కావాలి? మట్టిని గట్టిగా పిండుకుందాం. సారాన్ని బలవంతంగా పీల్చుకుందాం. రసాయన ఎరువులు వెదజల్లుదాం. క్రిమిసంహారకాలు పిచికారీ చేద్దాం.
... రైతు రైతులా ఆలోచించినంత కాలం వ్యవసాయం హాయిగా సాగింది. ఎప్పుడైతే వ్యాపారిలా ఆలోచించడం వెుదలుపెట్టాడో... ఆక్షణమే పతనం వెుదలైంది. ఏనెబావి కూడా అందుకు మినహాయింపు కాదు. 1975 నుంచి 1995 దాకా... అది వ్యవసాయం కాదు. రసాయన విధ్వంసం. కృత్రిమమైన దిగుబడి. విచ్చలవిడిగా ఎరువులేశారు. వేలకొద్దీ పెట్టుబడులు పెట్టారు. మితిమీరిన ఆశలు పెట్టుకున్నారు. వ్యవసాయాన్ని జూదంతో పోలుస్తారు. యాదృచ్ఛికమే కావచ్చు కానీ, జూదానికి అలవాటుపడిన కొత్తలో రాబడి బ్రహ్మాండంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అనిపిస్తుంది. అది కాకి బంగారమని తెలియడానికి ఎంతోకాలం పట్టదు. తెలిసేలోపు, పరిస్థితులు అదుపుతప్పిపోతాయి. ఇక్కడా అంతే. ఒకటిరెండు పంటలు విరగపండాయి. డబ్బే డబ్బు! రైతు రెచ్చిపోయాడు. పెట్టుబడి రెట్టించాడు. ఇంకో లోడు ఎరువులు దించాడు. క్రిమిసంహారకాలు టోకున కొన్నాడు. ఆ దెబ్బకి చిడపీడలు రాటుదేలిపోయాయి. మందుల్ని తట్టుకునే సత్తువ కూడగట్టుకున్నాయి. రైతన్న పప్పులు ఉడకలేదు. అప్పులే మిగిలాయి. అదో పాడుకాలం. పంటలేకాదు, మనశ్శాంతీ కరవైన కాలం.

కొత్త జీవితం... రైతులో ఆలోచన వెుదలైంది. దారి తప్పామని అర్థమైపోయింది. రసాయనాల ఊబిలోంచి బయటపడాలన్న తపన కనిపించింది. కానీ, ఎలా? వేలుపట్టుకు నడిపించేదెవరు? దారిచూపి పుణ్యంకట్టుకునేదెవరు?కష్టాలు, నష్టాలు, అప్పులు... ఇవి చాలవన్నట్టు రాకాసి బొంతపురుగులు! బొంతపురుగు సేద్యానికి బొంద పెడుతుంది. హద్దూ అదుపూ లేని రసాయనాల వాడకంతో... ఓ దశదాటాక పురుగులు నిరోధకశక్తిని పెంచుకున్నాయి. ఏ మందులూ ఏమీ చేయలేని పరిస్థితి. అప్పులతో నష్టాలతో సతమతమౌతున్న రైతన్నకు ఇదో పెద్దదెబ్బ! సరిగ్గా అప్పుడే... జనగామ కేంద్రంగా పనిచేస్తున్న క్రాప్స్‌ (సీఆర్‌వోపీఎస్‌- సెంటర్‌ ఫర్‌ రూరల్‌ ఆపరేషన్స్‌ ప్రోగ్రామ్‌ సొసైటీ) కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సంస్థ బొంతపురుగు నివారణకు ఓ ఉద్యమాన్ని ప్రారంభించింది. క్రాప్స్‌ వ్యవస్థాపకుడు రేకల లింగయ్య తన బృందంతో ఏనెబావికి వచ్చాడు. రైతుల కన్నీళ్లు చూశాడు. కష్టాలు విన్నాడు. దీపపు ఎరలతో తల్లిపురుగులను ఎలా నాశనం చేయవచ్చో ప్రత్యక్షంగా చూపించాడు. దెబ్బకి దెయ్యం వదిలింది. పురుగు పరుగుపెట్టింది. ఏనెబావి ప్రజలకు సంప్రదాయ సేద్యమంటే గురి కుదిరింది.
'నిజమే. మన తాతముత్తాతలు, వాళ్ల తాతముత్తాతలు... పర్యావరణానికి హాని జరగకుండా, రైతుకు నష్టం వాటిల్లకుండా... సమాజానికంతా మంచి జరిగేలా చక్కని వ్యవసాయ పద్ధతుల్ని రూపొందించారు. తాత్కాలిక లాభాలకు ఆశపడి మనం వాటిని దూరంచేసుకుంటున్నాం. అది తప్పు' అన్న పశ్చాత్తాపం కనిపించింది. అదే మార్పుకు తొలి అడుగు. ఆ అడుగు పొన్నం మల్లయ్యది. మిగిలిన రైతులంతా ఆ దార్లోనే నడిచారు. క్రాప్స్‌ సహకారం ఉండనే ఉంది. ఏనెబావి రైతులు 1995 నుంచి రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల వాడకాన్ని తగ్గించారు. 2005 నాటికి పూర్తిగా వదులుకున్నారు. దీంతో 'సెర్ప్‌ (సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ) సంస్థ ఏనెబావిని రసాయన రహిత గ్రామంగా ప్రకటించింది. అప్పటి నుంచి సేద్యంలో ఘాటైన రసాయనాల్లేవు. ప్రకృతికి నష్టం కలిగించే క్రిమిసంహారకాల్లేవు. ఆ గాలి స్వచ్ఛం. ఆ నీరు స్వచ్ఛం. ఆ పైరు స్వచ్ఛం. ఆ పంట స్వచ్ఛం.రసాయన సేద్యానికి బానిసైపోయాక రైతుకు పేడఎరువుల అవసరం లేకపోయింది. మూగజీవాల్ని నిర్లక్ష్యం చేశాడు. ఫలితంగా పశుసంపద తగ్గిపోయింది. సేంద్రియ వ్యవసాయం చేపట్టగానే దూరమైపోయిన పశువుల అవసరం గుర్తుకొచ్చింది. ఏనెబావి రైతుల వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకున్న ఆంధ్రాబ్యాంకు అధికారులు పశువుల్ని సమకూర్చుకోడానికి రుణాలిచ్చారు. ఇంకేముంది, గోధూళితో పల్లె పావనమైపోయింది. ఇప్పుడు అక్కడ, రోజుకు వంద లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఐదువందలకుపైగా పశుసంపద ఉంది. ఆ ఊళ్లో గేదెలే కాదు, ఆవులూ కనిపిస్తాయి. సేంద్రియ వ్యవసాయంలో గోమాతకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఆవు పేడ, పంచితం (మూత్రం), పాలు, పెరుగు, నెయ్యి కలిస్తే..పంచగవ్యం. ఇది చేనుకు చేవనిస్తుంది. ఇక గోమూత్రం, శనగపిండి, బెల్లంతో తయారు చేసే 'జీవామృతం' నేలకు రోగనిరోధక శక్తినిస్తుంది. వేపపిండి, వేపనూనె, వేప కషాయం, పొగాకు కషాయం, పచ్చిమిరప, వెల్లుల్లి కషాయం... ఇవే సేంద్రియ సాగులో తిరుగులేని క్రిమిసంహారిణులు. 'పర్యావరణంలో ప్రతిజీవి ప్రాణమూ విలువైందే..రసాయన ఎరువులు వాడితే శత్రుపురుగుల నాశనం సంగతి దేవుడెరుగు..మేలు చేసే నేస్తాలు కూడా నామరూపాల్లేకుండా పోతాయ్‌.. అందుకే మేం ఏ పురుగులనూ చంపడానికి ఇష్టపడం. సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నాం. రెండేళ్లుగా సంప్రదాయ క్రిమిసంహారిణులను కూడా వాడటం లేదు' అని రైతులు సగర్వంగా చెబుతారు. నిజమే, రైతుకు పంచడమే తెలుసు. చంపడం అతని ప్రవృత్తి కాదు.
అయిదు సంవత్సరాలుగా ఏనెబావి రైతులు ఎరువుల దుకాణాలకు వెళ్లడం లేదు. మరీ అవసరమైతే కోడిపెంటను వినియోగిస్తారు. దేశవాళి విత్తనాలనే నాటుతున్నారు. తమ భూమిలో పండిన విత్తనాల్నే తిరిగి వాడుకుంటున్నారు. నల్గొండ జిల్లా చొల్లేరులో జరిగిన విత్తన మేళాలో ఏకంగా 96 రకాల విత్తనాల్ని ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు.

అప్పుల తిప్పల్లేవు... రసాయన ఎరువుల్లేకుండా ఏనెబావి రైతులు పండించిన పంటలు పేరుప్రతిష్ఠల్నే కాదు, సిరిసంపదల్నీ వోసుకొచ్చాయి. పొరుగూళ్లోని షావుకారు దగ్గరికెళ్లి ప్రతి సీజన్లోనూ ట్రాక్టర్లకొద్దీ ఎరువులు తెచ్చుకున్న రైతులు... ఇప్పుడు అటువైపు తొంగి కూడా చూడటం లేదు. ఆ అవసరమే లేకుండా పోయింది. పెట్టుబడుల భారం తప్పింది. అప్పుల వూబిలోంచి బయటపడ్డారు. దానికితోడు,
రసాయన ఎరువులు వేయని ఆ పంటల్ని కొనడానికి ఎక్కడెక్కడి ప్రజలో వస్తున్నారు. పంట చేతికి రాకముందే అడ్వాన్సులు ఇస్తున్నారు. ఏనెబావిలో ప్రతిరైతు ఇంట్లో కనీసం ఐదు క్వింటాళ్లకు తక్కువ కాకుండా సన్నబియ్యం నిల్వలు ఉంటాయి. ఇక పప్పుధాన్యాలు, కూరగాయలు కొనాల్సిన అవసరమే లేదు. ఎవరికి పండినా... అందరూ పంచుకుంటారు.
ఆరోగ్య సంపన్నులు
స్వచ్ఛమైన ఏనెబావి గాలి చాలు, ఏ రోగమైనా నయమైపోతుంది. రసాయనాల ఆనవాళ్లు లేని ఆ ఆహారం చాలు, రోగనిరోధకశక్తి ఇనుమడిస్తుంది. దేశమంతా వ్యాపించిన చికున్‌ గున్యా వీరి దరిదాపుల్లోకి రాలేదు. కళ్లకలక వంటి అంటువ్యాధుల వాసన కూడా సోకలేదు. అకాల మరణాల బెడదే లేదు. మూడేళ్ల క్రితం ఓ పండు ముదుసలి మరణించారు. మళ్లీ, ఈ మార్చి 19న మరో పండుముదుసలి కాలం చేశారు. 'ప్రకృతిని కాపాడుకుంటున్నాం.. ప్రకృతి మమ్మల్ని కాపాడుతోంది' అంటారా గ్రామస్థులు. ఎవరికీ కేన్సర్‌, గుండె జబ్బు, మధుమేహం వంటి వ్యాధులు రాలేదని సగర్వంగా చెబుతారు. రసాయన ఎరువులు అతిగా వాడటం వల్ల వచ్చే కొన్నిరకాల చర్మవ్యాధులు, శ్వాసకోశవ్యాధులు... వూరి పొలిమేరల్లో కాలుపెట్టడానికి కూడా సాహసించడం లేదు.
జలమే జయం!
గ్రామ ప్రజలంతా కలిసి జలసంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఉన్న నీటినే సక్రమంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. భూగర్భజలాలను కాపాడుకునేందుకు అంతా ఒక్కటయ్యారు. గ్రామంలో 26 బోర్లు, 11 బావులు ఉన్నాయి. అవసరానికి మించి బోర్లు వేయకూడదని తీర్మానం చేసుకున్నారు. జలసంపద ఎక్కువగా ఉన్నవారు..కొరతలో ఉన్న వారికి సాయం అందించాలనే కట్టుబాటును ఎలాంటి మనస్పర్ధలకూ తావులేకుండా అమలు చేస్తున్నారు. గత మూడేళ్లలో గ్రామంలో కొత్తగా ఒక్క బోరు కూడా వేయలేదు. ఆ అవసరమే రాలేదు. వ్యవసాయంలో విద్యుత్తు పాత్ర కీలకంగా మారింది. ఈ సత్యాన్ని గ్రహించిన రైతులు, పంపుసెట్లకు కెపాసిటర్లను అమర్చారు. 100 శాతం కెపాసిటర్ల అమరికలో రాష్ట్రానికే ఆదర్శమయ్యారు. అనధికారికంగా విద్యుత్తు వాడకూడదని కట్టుబాటుచేసుకున్నారు. అదనపు కనెక్షన్ల కోసం డీడీలు చెల్లించారు.

ప్రశంసలే ప్రశంసలు! ఏనెబావి కీర్తి ఎల్లలు దాటింది. ప్రకృతినీ పర్యావరణాన్నీ కాపాడుతున్న గ్రామస్థుల కృషికి ప్రశంసలు వెల్లువెత్తాయి. జిల్లా, రాష్ట్రం, దేశ సరిహద్దులు దాటిన ఆ వ్యవసాయ విధానం గురించి తెలుసుకునేందుకు ఇప్పటి దాకా 30వేల మంది రైతులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని వూరువూరంతా.. గర్వంగా చెబుతుంది. పొన్నం పద్మ అనే మహిళారైతు శ్రీలంకకు వెళ్లి తమ విజయాలను వివరించింది. అక్కడి విశేషాలనూ విధానాలనూ అధ్యయనం చేసొచ్చి, స్థానిక రైతులకు పాఠాలు చెప్పింది. ఏనెబావి రైతులు ప్రకృతికి చేస్తున్న మేలు, పర్యావరణాన్ని కాపాడుతున్న తీరూ తెలుసుకున్న యోగాగురువు రాందేవ్‌ 'కృషిగౌరవ్‌' అవార్డును బహూకరించారు. లక్షా నూటపదహారు రూపాయల నగదు పురస్కారాన్ని అందించారు. ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందితే మరిన్ని అద్భుతాలు చేస్తామని గ్రామస్థులు అంటున్నారు.
వ్యవసాయ అవసరాలకు 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలనీ తాగునీటి అవసరాలకు ఓ వ్యవస్థను రూపొందించాలని కోరుతున్నారు. సేంద్రియ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక దుకాణాల్ని నిర్మించాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

*  *  *
కేంద్ర పర్యావరణ మంత్రి జైరాంరమేశ్‌ వచ్చివెళ్లారు. సాగు పద్ధతుల్లో మార్పును అభినందించారు. కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యుడు వీఎల్‌ చోప్రా, సెర్ప్‌ సీఈవో విజయ్‌కుమార్‌ తదితరులు కూడా ఏనెబావిని చూసివెళ్లారు. గతంలో వరంగల్‌ కలెక్టరుగా పనిచేసిన దమయంతి మూడు పర్యాయాలు పర్యటించి రైతులను ప్రోత్సహించారు. పదకొండు దేశాల ప్రతినిధులు వచ్చి పాఠాలు నేర్చుకున్నారు. అయితే, ఇప్పటి వరకూ రాష్ట్ర మంత్రులు కానీ, స్థానిక శాసనభ్యులు కానీ, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కానీ... ఇటువైపు తొంగి కూడా చూడలేదు. మనవాళ్లకు దగ్గర్లోని అద్భుతాలు కనిపించవు. దూరపుకొండలు చూడటానికి మాత్రం కోట్లు వెచ్చించి మరీ విదేశాలకు ప్రయాణమవుతారు. అలాంటి పల్లెలు మన అదృష్టం. ఇలాంటి నేతలు మన దురదృష్టం.
 

మా మంచి పల్లె
ఏనెబావి రైతులు సేంద్రియ వ్యవసాయ విధానంలోనే కాదు... జీవన విధానంలోనూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. పండుగపబ్బాలప్పుడు తప్పించి... మాంసాహారం జోలికి వెళ్లరు. ఊళ్లో గుడుంబా గుప్పు మనదు. కొద్దిమంది మాత్రం, తమ పొలాల్లో దొరికే తాటికల్లును మాత్రమే సేవిస్తారు. * ఏ ఇంట్లో తోరణం కట్టినా ఊరంతా పండగే. అందరికీ విందు భోజనమే.
* గ్రామ ప్రజలకు చదువు విలువ తెలుసు. ఇంగ్లీషు అవసరం తెలుసు. అందుకే రోజూ 13 మంది చిన్నారులు ఆటోలో జనగామ దాకా వెళ్లి కాన్వెంట్‌ చదువులు చదువుకుంటున్నారు. నలుగురు యువకులు డిగ్రీ పూర్తి చేశారు. అయినా, మట్టి మీద మమకారంతో సేద్యంలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.
* పల్లెకు పోలీసుల అవసరమే లేదు. ఏ సమస్య వచ్చినా తమలో తామే పరిష్కరించుకుంటారు. పోలీస్‌స్టేషన్లు, న్యాయస్థానాల గడప తొక్కే అవసరం ఎప్పుడూ రాలేదని గ్రామపెద్ద పొన్నం మల్లయ్య సగర్వంగా చెబుతారు.
* ఈ పల్లె నుంచి ఏకగ్రీవంగా ఓ సభ్యుడిని ఎన్నుకుని గ్రామపంచాయతీకి పంపుతారు. ఇప్పటిదాకా పోటీ లేదు. భవిష్యత్‌లోనూ ఉండబోదంటారు.
* ఏనెబావిలో ఒక్క గుడిసె కూడా కనిపించదు. అన్నీ పక్కా ఇళ్లే! గ్రామానికి తారు రోడ్డు తెచ్చుకున్నారు. ఊరంతటికీ ఒకే వీధి... ఆ వీధికి సిమెంటు రోడ్డు వేయించుకున్నారు. ప్రతి ఇంటిమీదా సేంద్రియ వ్యవసాయం, జలసంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలే చిరునామాల్లా దర్శనమిస్తాయి.
* ఎవరికి ఏ కష్టం వచ్చినా.. అది అందరిదీ. అంతా అండగా ఉంటారు. గ్రామంలోని రైతులు శ్రీరామ, మంజునాధ, కాకతీయ రైతుసంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాలన్నీ 'ఏనెబావి సేంద్రియ రైతు సంఘం' నాయకత్వంలో పనిచేస్తాయి. గ్రామంలోని రైతు శిక్షణ భవనంలో సమావేశాలను నిర్వహిస్తారు. నెలకు ఇరవై రూపాయల చొప్పున పొదుపుచేసి, అవసరమైన వారికి అప్పుగా ఇస్తారు. మహిళలు క్రాప్స్‌, ఇతర సంస్థల పరిధిలో పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.
* అసలే చిన్న గ్రామం. అన్ని వృత్తులవారూ లేకపోవడం ఓ సమస్యే. దీంతో వ్యవసాయానికి అవసరమైన నాగలి తదితర పరికరాలను తామే తయారు చేసుకుంటారు. ఒక్కో కుటుంబం ఒక్కో వృత్తిలో నైపుణ్యాన్ని సాధించింది.
* అవసరమైనప్పుడు రైతులే కూలీల అవతారమెత్తుతారు. ఒకరి అవసరాలకు మరొకరు వెళ్లి పనులు చేస్తారు. నాట్లు ఎక్కువగా ఉన్నప్పుడూ తామంతా సరిపోనప్పుడు మాత్రమే.. పొరుగూళ్ల సాయం తీసుకుంటారు.
.
ఏనెబావికి వెన్నెముక...
నెబావి కీర్తి ప్రతిష్ఠలు, రైతుల అభివృద్ధి, సుస్థిర వ్యవసాయం, రసాయనాల్లేని వాతావరణం..ఇన్ని విజయాలకు ప్రధాన కారణం జనగామలోని క్రాప్స్‌ సంస్థ. బొంతపురుగు నివారణ ఉద్యమం ద్వారా రైతులకు చేరువైన ఆ సంస్థ వ్యవస్థాపకుడి పేరు రేకల లింగయ్య, వ్యవసాయ శాస్త్ర పట్టభద్రుడు. ఎస్‌.ఆర్‌.శ్రీనివాస్‌, మహేందర్‌, గిరిబాబు, నర్మద, విష్ణు, లక్ష్మీనారాయణలతో పాటు మరో 12 మంది ఆయన బృందంలో సభ్యులు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ఆచరించేలా ఓర్పుతో రైతులను ఒప్పించగలిగారు. చెరువు మట్టి తరలింపులో, కోళ్లపెంట సరఫరాలో, వర్మీకంపోస్టు, గోమూత్ర సేకరణశాలల నిర్మాణం, పాడి పశువుల కొనుగోలుకు రుణాలు...ఇలా ఎన్నో విషయాల్లో ఏనెబావి రైతులకు అండగా నిలిచింది క్రాప్స్‌. సంప్రదాయ ఎరువుల తయారీలో శిక్షణ ఇచ్చింది. శ్రీవరిసాగు ఉద్యమానికి తెరతీసింది. 'మేం దారి చూపాం. గ్రామస్థులు నమ్మకంతో మావెంట నడిచారు. శ్రమించారు. ఫలితాలు సాధించారు. ఏనెబావిని ఆదర్శంగా నిలిపారు. తమ విజయాల్లో మాకూ స్థానం కల్పించారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ మార్పు.. ఈ ప్రయోగం.. ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా ముందుకెళ్లాలి. ప్రభుత్వం కూడా గుర్తించాలి. ప్రోత్సహించాలి' అంటారు రేకల లింగయ్య.

5 comments:

గిరీష్ said...

Great Post!
Keep it up

Unknown said...

Nice article buddy ... Who will educate the normal farmer about these things ... The basic thing is they need education at least up to 10th class. So that they can read and write and think on their own ....

Naveen said...

Nice catch of Eenadu artical Hemanth..

Hemanth Kumar R said...

@Rahman: We also have to take some initiative towards this. After all it is everybody responsibility.

Trivikram said...

Good information about ENABAVI......